HomeరాజకీయాలుPerni Nani: నమ్మినవారిని మోసం చేయడం బాబుకు అలవాటు: పేర్ని నాని

Perni Nani: నమ్మినవారిని మోసం చేయడం బాబుకు అలవాటు: పేర్ని నాని

Perni Nani: నమ్మిన వారిని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు అని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌గారిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.

జగన్‌ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్‌ ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్‌ ను నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు.

టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్‌ ను ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు.

వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌, వారికి పదవులు కట్టబెట్టారని గుర్తు చేసిన పేర్ని నాని, ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్‌ చేశారు. కేవలం జగన్‌ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని గుర్తు చేశారు.

ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.

తాము అధికారంలోకి వచ్చినా, నిత్యం మాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి, ఎల్లో మీడియా.. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్‌ చేశారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందని వెల్లడించారు.

2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్‌ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్‌ ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు.

Read also: Kadambari Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారంలో ఏపీ సర్కార్ కీలక చర్యలు
Nara Lokesh: ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పిస్తాం: మంత్రి లోకేష్
Irrigation: ఆఖరి ఎకరం వరకు నీరు అందిస్తాం: మంత్రి నిమ్మల
AP Cabinet: మళ్లీ పేపర్ లెస్ విధానం.. ఏపీ కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News