Amaravathi: రాజధాని అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఇక్కడ వచ్చే నీటిని రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం ద్వారా నిల్వ చేస్తామని చెప్పారు. కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైయస్సార్ సీపీ చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందన్నారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు,రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు. కొండవీటి వాగు, పాల వాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని మంత్రి చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు,దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు,వైకుంఠపురం గ్రావిటీ కెనల ను 8 కిమీ మేర అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తామన్నారు.
రాజధానిలో 2014-2019 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. దీని కోసం ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైలకు భవనాలు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టుతో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్ లకు ఎలాంటి ఇబ్బందీ లేదని నివేదిక తెలిపిందన్నారు. ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాల వల్ల ఇబ్బంది కలిగిందని, త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఒక ఏడాది కౌలు కింద రూ.175 కోట్లు రేపు లేదా ఎల్లుండి జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలోని కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద గతంలో రైతులు భూములు ఇవ్వలేదని, అలాంటి వారు ప్రస్తుతం భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. అలా భూములు ఇస్తానంటే వారి ఇంటికి స్వయంగా నేనే వెళ్లి అంగీకార పత్రాలు తీసుకుంటానన్నారు.
Read also: Telangana: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా సాయం అందించండి
Revanth Reddy: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి శృంగేరి పీఠం అనుమతి కోసం ప్రత్యేక బృందం
Jr NTR: ముంబైలో దేవర.. అంతటా ట్రైలర్ మూడ్!
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ రూ.కోటి విరాళం